ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి బరితెగించిన పాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 13, 2018, 09:55 AM

సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ సైన్యం బరితెగించింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కశ్మీర్‌ సహా సరిహద్దుల్లో కాల్పుల విరమణ పాటిస్తోన్న సైన్యంపై పాక్ దాడి చేసింది. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ అసిస్టెంట్ కమాండెంట్, ఎస్ఐ సహా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూలోని చంబిలియాల్ సెక్టార్, కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో బుధవారం ఉదయం పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో నలుగురు జవాన్లు అమరులవ్వగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను జమ్మూలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. 


కొద్ది వారాల క్రితమే కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ ఆ ఒప్పందాన్ని అంతలోనే ఉల్లంఘించింది. జూన్ 3 న పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అఖ్నూర్ సెక్టార్లోని ప్రగ్వాల్ ఏరియాలో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు పాల్పడటంతో బీఎస్ఎఫ్ దళాలకు చెందిన ఏఎస్ఐ, జవాన్ అమరులయ్యారు. కాల్పుల విరమణ పాటిద్దామని హాట్ లైన్ ద్వారా పాకిస్థాన్ డీజీఎంవో మే 29న చేసిన ప్రతిపాదనకు భారత డీజీఎంవో అంగీకరించింది. ఈ ప్రతిపాదన తెచ్చిన నాలుగు రోజుల్లోనే పాక్ తన దురాగతాన్ని బయటపెట్టుకుంది. 


భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహన్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ సాహిర్ మీర్జాలు ఇటీవలే సరిహద్దుల వెంబడి పరిస్థితిని సమీక్షించారు. కాల్పుల విరమణ పాటించాలనే నిర్ణయానికి వచ్చారు. మే 15, 23 తేదీల్లో జమ్మూ, కథువా, సాంబా సెక్టార్లలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులకు పాల్పడింది. దీంతో వేలాది మంది సరిహద్దుల నుంచి దూరంగా తరలి వెళ్లారు. పాక్ కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు సహా 12 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ప్రతీకారంతో రగిలిన భారత బలగాలు విరుచుకపడి పాక్‌ సైన్యంపై దాడిచేసి వారి వెన్నులో వణుకు పుట్టించాయి. దీంతో కాల్పులు ఆపాలంటూ దాయాది వేడుకుంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com