హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించేలా కోరాలని సీఎం నిర్ణయించారు.
దీనిపై అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం కేబినేట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదనపు అడ్వకేట్ జనరల్, సంబంధిత అధికారులను భేటీకి ఆహ్వానించాలని సీఎం తెలిపారు. అన్ని విషయాలు కూలంకశంగా చర్చించి.. పూర్వాపరాలు పరిశీలించాలన్నారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో 61 శాతం రిజర్వేషన్ల అవసరాన్ని నొక్కి చెప్పాలన్నారు. ఈమేరకు వాదనలు ఖరారు చేయాలని సీఎం తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. దాని కోసం అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని సీఎం వెల్లడించారు.