అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మోనాల్ గుజ్జర్, తాను బతికే ఉన్నానని చెబుతూ ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చి, అభిమానులను పలకరించింది. మూడు రోజుల క్రితం తన మిత్రుడైన ఓ డాక్టర్ పుట్టిన రోజు వేడుకల కోసం అహ్మదాబాద్ నుంచి ఉదయ్ పూర్ కు వెళ్లిన ఆమె, తిరుగు ప్రమాదంలో భారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మోనాల్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసం కాగా, ఆమె మరణించిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ యాక్సిడెంట్ లో తన మెడ బెణికిందని, అంతకు మించి ఇంకేమీ కాలేదని, కారులోని మిగతావారూ ప్రాణాలతోనే ఉన్నారని స్పష్టత ఇచ్చింది. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది. దేవుడి దయ, అభిమానుల ఆదరణతోనే తన ప్రాణాలు మిగిలాయని చెప్పింది. ఫేస్ బుక్ లైవ్ లో మోనాల్ మెడకు బెల్ట్ ధరించి కనిపించింది.