గోదావరి నదిలో వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ వరద నదిలో వచ్చి చేరుతుండగా, కొద్దిసేపటి క్రితం రాజమండ్రి, దవళేశ్వరం బ్యారేజ్ కి ఉన్న మొత్తం 175 గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. మొత్తం 3.30 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేశారు. నిన్నమొన్నటి వరకూ గేట్లన్నీ మూసి, స్వచ్ఛమైన నీటితో ఉన్న గోదారమ్మ తల్లి, ఇప్పుడు ఎర్రటి వరద నీటితో నిండిపోయింది. బ్యారేజ్ అన్ని గేట్లనూ ఎత్తివేయడంతో, భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఈ దృశ్యాన్ని వీక్షిస్తున్నారు. ఏపీ విభజన తరువాత తెలంగాణ ప్రాంతంలో ఉండి, ఆపై ఏపీలో చేరిన విభజన మండలాల్లో కురిసిన వర్షాలకు శబరీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు, పైనుంచి వస్తున్న నీటితో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోందని అధికారులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 9 అడుగులకు పైగా ఉంది. ఈ సాయంత్రానికి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు, వచ్చిన నీటిని వదులుతున్నట్టు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రాజెక్టు నుంచి పొలాల్లోకి దారితీసే అన్ని కాలువల్లోకీ పూర్తి స్థాయి నీటిని వదులుతున్నామని తెలిపారు.