రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టికి వరద క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6గంటలకు లక్షా 62 వేల క్యూసెక్కుల్లో ఉన్న వరద సాయంత్రానికి లక్షా 73 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అధికారులు అంతేమేర వరదను నారాయణపూర్కు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి కూడా వరద లక్షా 83 వేల క్యూసెక్కులకు పైగా వస్తుంటే.. అంతకంటే ఎక్కువగా అవుట్ఫ్లో నమోదవుతున్నది. దీంతో జూరాలకు కృష్ణాజలాలు పోటెత్తుతున్నాయి. జూరాలకు లక్షా 80 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, లక్షా 88వేల క్యూసెక్కులకు పైగా అవుట్ఫ్లో నమోదయ్యాయి.
జూరాలలో నీటిప్రవాహాన్ని బట్టి విడుదల చేసేందుకు ఒక గేటును 5 మీటర్లు, 3 గేట్లను 4 మీటర్లు, 2 గేట్లను 3 మీటర్లు, 2 గేట్లను 3.5 మీటర్లు, 4 గేట్లను 2 మీటర్లు, 3 గేట్లను ఒక మీటర్ ఎత్తారు. భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో పవర్ ప్రాజెక్ట్లోని ఆరు టర్బయిన్లను ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తికోసం పవర్ హౌస్కు 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి బుధవారం రాత్రే అవుట్ఫ్లో మొదలవడంతో శ్రీశైలం జలాశయానికి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత నుంచి జలాలు చేరుకుంటున్నాయి.
శ్రీశైలంకు గతేడాది ఆగస్టు 28 వరకు రెండువేల క్యూసెక్కులలోపు ఇన్ఫ్లోలు నమోదయ్యాయి. ఆగస్టు 30న 14,461 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవగా, సెప్టెంబర్ 2న 9,718 క్యూసెక్కులు, 3 నుంచి 20 వేల క్యూసెక్కులకుపైగా వరద మొదలై క్రమంగా పెరిగింది. ఈ సారి నెల ముందుగానే లక్షా 76 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. శ్రీశైలం జలాశయానికి దాదాపు 8.09 టీఎంసీల వరద వచ్చి చేరింది.
జూరాలకు భారీగా వరద వస్తుండటంతో జల విద్యుత్ కేంద్రంలో రోజుకు 4 నుంచి 5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే 150 మెగావాట్లను ఉత్పత్తి చేశారు. గతేడాది ఆగస్టు 31న విద్యుత్ ఉత్పత్తి ప్రారంభంకాగా ఈసారి నెల రోజుల ముందుగానే ఉత్పత్తి ప్రారంభమైంది. భారీగా వరద వస్తుండటంతో ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో విద్యుదుత్పయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత పదేండ్లలో 2013-14వ సంవత్సరంలో అత్యధికంగా 270.844 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. 2017-18లో 122 రోజుల్లో 217.399 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఈసారి అంతకుమించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇక గోదావరి బేసిన్లో ఈ ఏడాది వరద ఉధృతంగానే ఉంది. ఎల్లంపల్లి జలాశయంలో 20.18 టీఎంసీల సామర్థ్యానికిగాను 13 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకున్నది. పేరూరు మీదుగా 8.47 మీటర్ల ఎత్తులో గోదావరి 3.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో దిగువకు పోతున్నది. ఈ క్రమంలో ధవళేశ్వ రం నుంచి 3.87 లక్షల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. ఇప్పటివరకు సముద్రంలోకి 302.597 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా వెళ్లిపోయాయి.
కృష్ణా, గోదావరి బేసిన్లలోని మధ్య తరహా ప్రాజెక్టులకు కూడా భారీగా వరద వస్తున్నది. కృష్ణా బేసిన్లోని డిండి, మూసీ, కోటిపల్లి, పాకాల, వైరా, లంకాసాగర్, బయ్యారం ప్రాజెక్టులకు 2867 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ పెరుగుతున్నది. గోదావరి బేసిన్లోని 29 మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి 15,029 క్యూసెక్కుల వరద వస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు నుంచి 9 గేట్లు ఎత్తి 10,683 క్యూసెక్కులను వదులుతున్నారు. కిన్నెరసాని మూడు గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 407 అడుగుల పూర్తి స్థాయికి నీటి మట్టం చేరింది.ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో దిగువ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు.. 5 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.