హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో దివ్యాంగులకు ప్రాధాన్యతనిస్తామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దివ్యాంగుల సహాయ ఉపకరణముల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, దివ్యాంగుల సంఘం చైర్మన్ వాసుదేవరెడ్డి, కార్యదర్శి జగదీశ్, ఎండీ శైలజ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటల.. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. 2016లో దివ్యాంగుల కోసం గొప్ప చట్టాన్ని తెచ్చిన రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని కొనియాడారు. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న వారికి ఈ వాహనాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రెండో విడతలో డిగ్రీ చదివి ఉన్న నిరుద్యోగ వికలాంగులకు ఈ పథకం ద్వారా అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ. అనేక సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో 5 శాతం కోటా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేంద్రం ప్రవేశపెట్టిన 2016 చట్టాన్ని తొలిసారిగా రూపొందించిన ప్రభుత్వం.