అంబేద్కర్ లేకుంటే తాను లేనని మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇవాళ నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆంధ్రా బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ఆల్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్కు మంత్రి కడియం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం ఫలించింది అంబేద్కర్ వల్లనే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే సాధ్యమైందన్నారు. అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అందరికీ విద్యనందించాలనే అంబేద్కర్ ఆశయంతోనే రాష్ట్రంలో అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.
"దళితులు ఎదిగిన తర్వాత కూడా వారిపై దాడులు జరుగుతున్నాయి. అత్యాచార నిరోధ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నది. ముందస్తు బెయిల్ అవసరం లేదన్న సుప్రీం కోర్టు తీర్పుపై దళితులు రోడ్డెక్కారు. పీఓఏ చట్టాన్ని కాపాడటం కోసం అనేక మంది దళితులు చనిపోయారు. కేంద్రం వెంటనే పీఓఏ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకురావాలి. పీఓఏ చట్టాన్ని బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పీఓఏ చట్టం కాపాడడాన్ని సీరియస్గా తీసుకోవాలి.
పేదలకు లబ్ది చేకూరాలని బ్యాంకులను జాతీయం చేశారు. బ్యాంకుల జాతీయ లక్ష్యం నెరవేరడం లేదు. పేదలకు బ్యాంకులు చేరువగా లేవు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొడుతున్నారు. పేదవాడికి పదివేలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. బ్యాంకుల వైఖరి వల్లే పేదవాళ్ల కోసం పెట్టిన ప్రభుత్వ ఆర్థిక సహకార పథకాలు వారికి అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ బ్యాంకులను పేదలకు దగ్గరగా తీసుకెళ్లాలి.." అని మంత్రి పేర్కొన్నారు.