హైదరాబాద్: ప్రకృతి ప్రకోపతంతో వణికిపోతున్న కేరళ రాష్ర్టానికి భారత ప్రభుత్వం చేయదగిన సాయంమంతా చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత కోరారు. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 26 మంది చనిపోయారు. రాష్ట్రంలోని నదులు ఉధృతంగా పొంగిపోర్లుతున్నాయి. పలు గ్రామాలు జలమయమయ్యాయి. రోడ్లు, రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రస్తుత స్థితిపై కవిత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ప్రకృతి ఈ ఏడాది కేరళపై దయచూపడం లేదన్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం చేయదగిన సాయమంతా తక్షణమే అందించాల్సిందిగా కోరారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.