జనగామ జిల్లాలోని పెంబర్తిలో రైతులకు రైతుబంధు జీవిత బీమా పత్రాలను డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడు వచ్చేది తెలువకుండా ఉండేదన్నారు. తెలంగాణ వచ్చిన ఈ నాలుగేళ్లలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ నిరంతరంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. కరెంట్ కష్టాల నుంచి బయటపడ్డామని కడియం తెలిపారు.15 రోజుల్లో దేవాదుల ప్రాజెక్టు ద్వారా పెంబర్తి చెరువు నింపి సాగు కష్టాలు కూడా తీరుస్తాం. గతంలో ఎన్నడూ నిండని పెంబర్తి చెరువు కేసీఆర్ పాలనలో నిండింది. ఈసారి మళ్ళీ చెరువు నింపి ఈ గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటాం.