రాష్ట్రం లో భారీసంఖ్యలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్శాఖలో 6,603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ.. ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వీటి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుందని అధికారులు చెప్పారు. ఇటీవల కొత్తగా 4,383 పంచాయతీలను ఏర్పాటుచేయడంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య 12,751కి పెరిగింది. రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీకి కార్యదర్శి ఉం డాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాదాపు 9,300 గ్రామ కార్యదర్శుల నియామకాలకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. తొలిదశలో కొత్తవాటితోపాటు పాత పంచాయతీల్లో కూడా కార్యదర్శుల ఖాళీలను భర్తీచేయడానికి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ప్రతి గ్రామపంచాయతీ బలోపేతంతోపాటు పరిపాలనాపరంగా ఇబ్బందులు రాకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగం గా గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపడుతున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.