భారత క్రికెటర్ పుజారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గత పదేళ్లలో టెస్టు క్రికెట్లో అత్యధిక సార్లు రనౌటైన ఆటగాళ్ల జాబితాలో పుజారా అగ్రస్థానంలో నిలిచాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు కొనసాగుతోంది. వర్షం కారణంగా గురువారం తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. శుక్రవారం టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్ను మొదట బ్యాటింగ్కు ఆహ్వానించింది. రోజు మొత్తం మీద సుమారు మూడు గంటలపాటు మాత్రమే జరిగిన మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 107 పరుగులకే భారత్ కుప్పకూలింది. శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన పుజారా రనౌట్ గురించే ఇప్పుడు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. తనదైన శైలిలో డిఫెన్స్ ఆడుతూ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నం చేస్తోన్న పుజారా.. కోహ్లీ తప్పిదం కారణంగా ఔటయ్యాడు. సిల్లీ పాయింట్లో బంతిని ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు పుజారా. కోహ్లీ కూడా స్పందించడంతో అతను ముందుకెళ్లిపోయాడు. కానీ తర్వాత కోహ్లీ మనసు మార్చుకుని వెనుకంజ వేశాడు. కానీ, అప్పటికే పుజారా చాలా దూరం వెళ్లిపోయాడు. తిరిగి క్రీజులో బ్యాట్ పెట్టేలోపు పుజారాను పోప్ రనౌట్ చేశాడు. 41 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన పుజారా 25 బంతులాడి ఒక్క పరుగే చేశాడు.
గత పదేళ్లలో టెస్టు క్రికెట్లో అత్యధిక సార్లు రనౌటైన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే పుజారానే ముందున్నాడు. మొత్తం ఎనిమిది సార్లు అతను రనౌట్ అయ్యాడు. మ్యాట్ ప్రియర్, రంగనా హెరాత్, రికీ పాంటింగ్, రాస్ టేలర్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ పదేళ్లలో మొత్తం 13 మంది భారత ఆటగాళ్లు రనౌట్ అవ్వగా... అందులో 8సార్లు పుజారానే ఉండటం గమనార్హం.