కేరళ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా వరదలు సంభవించడంతో జనజీవనం అస్థవ్యస్ధమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 385 మంది దుర్మరణం చెందారు. 13జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపు ఇవ్వడంతో క్రీడాలోకం కదిలింది. పలువురు క్రీడా ప్రముఖులు తమ విరాళాలను అందిస్తున్నారు.
కేరళ వరదలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. కేరళలోని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండండి. త్వరలో మీ సమస్యలు తీరతాయని ఆశిస్తున్నాను. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో సేవలు అందిస్తోన్న భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్కు ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరూ దృఢంగా, జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశాడు.
కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం వరదల పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రధాని ఉదయం కోచి నేవీ బేస్ నుంచి ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర అధికారులతో సమీక్ష జరిపిన ప్రధాని మోదీ కేరళకు రూ. 500కోట్ల సాయం ప్రకటించారు.