హైదరాబాద్, మేజర్న్యూస్ః మాదిగల వర్గీకరణ కోసం అఖిలపక్ష బృందాన్ని తానే ప్రధాన మంత్రి వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్... ఆ మాటను మర్చిపోయారా లేక కాలయాపన ద్వారా అందరినీ మరిపించాలను కుంటున్నారా? అని టీడీఎల్సీ నేత రేవంత్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మాదిగల వర్గీకరణపై ఆయనకు ఎమాత్రం చిత్త శుద్ది ఉన్నా తక్షణం అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని, ఈ శాసనసభ సమావేశాలలోనే దీనిపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాదిగల వర్గీకరణ, దళిత గిరిజనుల అభివృద్దిపై రేవంత్ శుక్రవారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. దళితులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేయూతను ఇవ్వకపోగా సామాజికంగా ఎదగడం కోసం దళిత వర్గానికి చెందిన మాదిగలు కోరుకుం టున్న ఎబిసిడి వర్గీకరణ విషయంలో పూటకో మాట, ఘడియకో ఆట అన్న తరహాలో ప్రవర్తిస్తోందని విమర్శించారు. మాదిగల శంఖారావం కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎంను కూడా ఆహ్వానించడానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగకు సీఎంను కలువడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తినందుకు టిడిపి ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. ఈ విషయంపై అన్ని విపక్షాలు సీఎంను నిలదీయడంతో మాదిగల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, దీనికోసం రాష్ట్రం నుంచి అఖిల పక్ష బృందాన్ని కేంద్రానికి తీసుకెళ్తానని సీఎం మరోసారి శాసనసభ సాక్షిగా హామీ ఇచ్చారని, అలాగే ప్రధాని అపాయిం ట్మెంట్ తీసుకున్నామని చెప్పారన్నారు. అయితే మళ్లీ ప్రధాని అపాయింట్మెంట్ రద్దు అయిందని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఈ కార్యక్రమం వాయిదా పడి ఇప్పటికి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మళ్లీ ప్రధాని అపాయింట్మెంట్ను కోరడం గానీ, అఖిలపక్ష బృందాన్ని మాదిగల వర్గీకరణ కోసం డిల్లీకి గానీ తీసుకెళ్లడం జరుగలేదని రేవంత్ ధ్వజమెత్తారు. సీఎంకు ఏమాత్రం చిత్త శుద్ది ఉన్నా వెంటనే ప్రధాని అపాయింట్మెంట్ కోరాలని, అఖిలపక్ష బృందాన్ని డిల్లీకి తీసుకెళ్లి మాదిగల చిరకాల డిమాండ్ తీర్చడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టని యెడల మాదిగ సోదరులతో కలిసి మరోసారి తెలుగుదేశం పార్టీ ప్రజాందోళనకు పూనుకోవడానికి సిద్దంగా ఉందని రేవంత్ హెచ్చరించారు.