హైదరాబాద్ : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ నా డ్రీమ్ ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో విద్యా విధానం అమలు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. కేజీ టు పీజీ ప్రాజెక్టులో పటిష్టమైన అడుగు ముందుకు వేశామన్నారు. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్థి స్థాయిలో తీసుకురావడానికి కొంత సమయం పడుతుందన్నారు. గతంలో ఎన్నుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ విద్యార్థినుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశాం. త్వరలోనే గురుకులాల్లో 24 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నామని ప్రకటించారు. గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ర్టంలోని 50 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించడం గత పాలకుల వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు.