హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే నగరంలో 16,562 ఇళ్లకు టెండర్లు పూర్తై పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. త్వరలో మరో 16 వేల ఇళ్లకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. మిగిలిన 70 వేల ఇళ్లకు ఒకేసారి టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని చోట్ల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. నగర శాసనసభ్యులు చొరవచూపి నియోజకవర్గాల్లో ఖాళీ స్థలాలను గుర్తించాలని సూచించారు. మురికివాడల్లోని పేదలను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణాల కోసం యూనిట్ ఏర్పాటు చేయాలని ఇంద్రకరణ్రెడ్డిని కేటీఆర్ కోరారు. ఇళ్లను లబ్ధిదారులు అమ్ముకోకుండా మార్గదర్శకాల్లో నిబంధన చేర్చాలన్నారు కేటీఆర్. నగరంలో లక్ష ఇళ్లు కట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాన్ని నెరవేరుస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు.