మంచిర్యాల : వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చిత్రహింసలు పెడుతున్న కొడుకు దాష్టీకమిది. ఇరుగుపొరుగు స్పందనతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మంచిర్యాలలో జరిగింది. పట్టణంలోని హైటెక్ సిటీకాలనీలో రిటైర్డ్ హెచ్ఎం డీ వెంకట్రాంనర్సయ్య నివాసముంటున్నాడు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
ఆయన తల్లి రాధాదేవి(85) అనారోగ్యంతో ఒంటికి పుండ్లుపడి లేవలేనిస్థితిలో బాధపడుతున్నది. పట్టించుకోవాల్సిన కొడుకే, తల్లిని ఇం ట్లోకి రానివ్వకుండా బాల్కనీలో ఉన్న వాష్రూంలో పడేశాడు. ఒంటిమీద నూలుపోగు లేక గచ్చుపైనే రాధాదేవి కొన్ని నెలలుగా కాలం వెళ్లదీస్తున్నది. ఎండకాలం నేపథ్యంలో మధ్యాహ్నం వేళ గచ్చు వేడికి తాళలేక వృద్ధురాలు అరవటాన్ని స్థానికులు వీడియో, ఫొటోలు తీసి పోలీసులకు పంపినా స్పందనరాలేదు. మంగళవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు చేరవేశారు. ఆయన ఆదేశాలతో మంచిర్యాల ఆర్డీవో ప్రతాప్, తహసీల్దార్ ఆ ఇంటికి వెళ్లగా వెంకట్రాంనర్సయ్య కుటుంబీకులు వాగ్వాదానికి దిగి తిరుగుబాటు చేశారు. కేసు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించడంతో, రాధాదేవికి పుండ్లు ఉండడంతో డెటాల్తో కడిగి గాలికి ఆరబెట్టామంటూ డొంక తిరుగుడు సమాధానం చెప్పారు. రాధాదేవిని అధికారులు మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమానికి పంపించనున్నట్టు వెల్లడించారు.