షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. బస్సులు, కార్లు, ట్రెయిన్లలో వెళ్లే ప్రయాణీకులు.. షిర్డీకి ఇకపై విమానాల్లో వెళ్లొచ్చు. వచ్చే నెల నుంచి ఫ్లైట్ లో బాబా దగ్గరకు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తోంది ఏవియేషన్ డిపార్ట్ మెంట్. దీని కోసం షిర్డీ ఎయిర్పోర్టును పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తోంది మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (MADC). అహ్మద్నగర్ జిల్లాలో ఎయిర్పోర్ట్ సిద్ధమవుతోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుతో పాటు దేశంలో పలు నగరాల నుంచి షిర్డీకి విమానాలు నడుపనున్నారు. 2002లో MADCని స్థాపించిన తరవాత తాము నిర్మించిన తొలి ఎయిర్పోర్టు ఇదేనని చెబుతున్నారు ఆ సంస్థ అధికారులు. అయితే మొదటగా షిర్డీకి దేశీయ విమానాలనే నడుపుతామని, ఆ తరవాత అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభిస్తామన్నారు. మొదట రోజుకి నాలుగు నుంచి ఐదు విమానాలు నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా, షిర్డీ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే రూ. 340.54 కోట్లు మంజూరు చేసింది.