ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళాతపస్వి ని వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2017, 01:04 PM

ప్రముఖ దర్శకుడు, నటుడు కళాతపస్వి కే విశ్వనాథ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చిచేరింది. భారత ప్రభుత్వం సినీరంగానికి విశిష్ట సేవలందించినవారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద స్వర్ణకమలం, పది లక్షల నగదు అందజేస్తారు. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విశ్వనాథ్ అవార్డును అందుకుంటారు. 2016 సంవత్సరానికి విశ్వనాథ్ పేరును సూచిస్తూ దాదాసాహెబ్ ఫాల్కే కమిటీ చేసిన సిఫారసుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రి ఎం వెంకయ్యనాయుడు సోమవారం ఆమోదం తెలిపారు. కళాత్మక చిత్రాల దర్శకునిగా విశ్వనాథ్‌కు గొప్ప పేరుంది. శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల, స్వాతిము త్యం, స్వాతికిరణం వంటి సంగీత, నృత్య ప్రధాన చిత్రాలతో ఆయన దేశవిదేశాల్లో ఖ్యాతిని గడించారు. 1930 లో జన్మించిన కాశీనాథుని విశ్వనాథ్ 1965 నుంచి సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 50 చిత్రాలను ఆయన రూపొందించారు. పాత్రోచిత సంభాషణ, సహజత్వం ఉట్టిపడే కెమెరా పనితనం, అన్నీటికి మించి వీనుల విందైన సంగీతం ఆయన సినిమాల ప్రత్యేకత.


సామాజిక సమస్యలకు సంగీత నాట్యాలను మేళవించి ఆయన తీసిన సినిమాలు అనితరసాధ్యం. అన్నీ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలు కావడం మరో విశేషం. కథాకథనాలు ఏవైనా మనిషిలోని మంచితనానికి పట్టం కట్టాలన్నదే ఆయన లక్ష్యం. సినిమాల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన సినిమాలకు 5 జాతీయ బహుమతులు, 20 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. ఫిలింఫేర్ జీవనసాఫల్య పురస్కారం కూడా విశ్వనాథ్ అందుకున్నారు. 59వ ఆస్కార్ అవార్డులకు ఆయన తీసిన స్వాతిముత్యం విదేశీ చిత్రాల క్యాటగిరీలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా నమోదైంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com