లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర ప్రార్థనా మందిరాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి వాటికి ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు రావడంతో యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల చుట్టూ ప్రహరీ నిర్మించడంతోపాటు ఆయా ప్రాంతాలకు దారితీసే నాలుగు లేన్ల రోడ్లపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. సాధువుల వేషధారణలో ఉగ్రవాదులు పవిత్ర స్థలాల్లోకి ప్రవేశించి దాడులు జరిపే అవకాశం ఉందన్న హెచ్చరికల మేరకు నిఘా పెంచినట్టు మథుర అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సెక్యూరిటీ) సిద్ధార్థ వర్మ పేర్కొన్నారు. అయోధ్య, వారణాసి, బృందావన్, తాజమహల్ తదితర వాటిని ఐఎస్ఐ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుందని, ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచినట్టు సిద్ధార్థ వర్మ తెలిపారు.