ఢిల్లీ: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇవాళ రెండు నూతన పథకాలను ప్రవేశపెట్టారు. ఒన్ ఐపీ- టూ డిస్పెన్సరీస్(బీమా చేసిన వ్యక్తి రెండు ఆస్పత్రుల సేవలు పొందడం) పథకం ఒకటికాగా ఆధార్ అనుసంధానిత ఆన్లైన్ చెల్లింపు సమర్పణ పథకం మరొకటి. కార్మిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ భద్రత, వేతన భద్రత, సామాజిక భద్రతను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్మికులకు కనీస వేతనంలో నూతన విధానాలకు చొరవ తీసుకుంటున్నామన్నారు. 43 కార్మిక చట్టాలను నాలుగు లేబర్కోడ్లుగా విభజించి కేబినెట్కి పంపించామని తెలిపారు. వలస కార్మికుల కోసం ఒక ఐపీ-రెండు ఆస్పత్రుల పథకం ప్రారంభించాం. దీని వల్ల పన్నెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అదేవిధంగా ఆన్లైన్ ఆధార్ ద్వారా పింఛన్లు మంజూరును ప్రారంభించినట్లు చెప్పారు. 60 లక్షల మంది కార్మికులకు కొత్తగా ఈపీఎఫ్ఓలో ఖాతాలొచ్చాయన్నారు. కోటికి పైగా కార్మికులకు సామాజిక సురక్ష కల్పిస్తున్నమన్న ఆయన కార్మికుల హక్కులను కాలరాయకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జాతీయ కనీస వేతన చట్టాన్ని తీసుకువచ్చాం.. ఈ చట్టం ద్వారా క్షేత్రస్థాయిలో కనీస వేతనాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు.