దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రతి నాలుగు గంటలకూ ఒక అత్యాచారం జరుగుతోంది. డిసెంబర్ 16 గ్యాంగ్ రేప్ నిందితులకు సుప్రీం కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఢిల్లీ దేశానికే కాదు, అత్యాచారాలకూ రాజధానిగా మారపోయిన అంశం మరోసారి చర్చకు వచ్చింది. డిసెంబర్ 16, 2012న కదులుతున్న బస్సులో నిర్భయపై దారుణంగా, అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురు నిందితులకు సుప్రీం కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన ఇద్దరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష అనుభవించి బయటకు రాగా, మరోకడు జైల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్భయ నిందితులకు కోర్టు ఉరి శిక్ష విదించడం పట్ల మరణ శిక్షలను వ్యతిరేకించేవారు సైతం హర్షం వ్యక్తం చేస్తుండటం అత్యాచారాల పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరిక్తతకు అద్దం పడుతుంది. అత్యాచారానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించేలా చట్టాలను సవరిస్తే హస్తినలో ఈ తరహా నేరాలకు బ్రేక్ వేసినట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.