చిన్నప్పటి నుండి సినిమాలన్నా, సినిమా రంగమన్నా పిచ్చి, వ్యామోహం. అందుకే లండన్లో పదేళ్ళుగా డాక్టర్గా కొనసాగినప్పటికీ సినిమా మీద ఉన్న ప్రేమతో పరిశ్రమకు కొత్త టాలెంట్ను పరిచయం చేయాలన్న సదుద్ధేశ్యంతో సినిమాలు తీస్తున్నాను అంటున్నారు నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాథ్. అలెక్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత ప్రేమాయనమః, అలెక్స్, హోప్, చంద్రహాస్, రాజేంద్ర సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు హరనాథ్. ప్రస్తుతం ఈయన తాజాగా హెచ్ ప్రొడక్షన్స్ పతాకంపై తనే నటిస్తూ స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం టిక్టాక్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుదలకు సిద్దమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు దర్శకనిర్మాత పోలిచెర్ల హరనాథ్ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు..నేను తిరుపతిలో పుట్టి పెరిగాను. తిరుపతిలో ఉండడం వల్ల ప్రతి రెండవ శనివారం తిరుపతి కొండమీదకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేవాణ్ణి. అలా దైవ భక్తి కూడా ఎక్కువగా ఉండేది. తిరుపతిలో ఉండడంవల్ల సీనియర్ నటుడు శివప్రసాద్గారితో మంచి పరిచయం ఏర్పడింది. ఆయనతో చాలా నాటకాల్లో నటించాను. అలా సినిమాల మీద చిన్నప్పటి నుండి ఇష్టం ఏర్పడింది. సినిమా రంగంలోకి రావాలనుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల లండన్లో డాక్టర్గా 10 సంవత్సరాలు చేశాను. అయితే సినిమాల మీద ఇష్టంతోనో మరి దేనివల్లో కానీ వృత్తిలో సంతృప్తి లేకపోవడంతో 2005లో సహనిర్మాతగా, నటుడిగా వెన్నెల చిత్రంలో చేశాను. ఆ తరువాత ప్రేమాయనమః, అలెక్స్, హోప్, చంద్రహాస్, రాజేంద్ర సినిమాలు చేశాను. హోప్ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే చంద్రహాస్ చిత్రానికి స్వర్ణ నందిని పొందడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి. అలాగే సతీష్, దేవకట్టాలాంటి దర్శకుల్ని, వెన్నెల కిషోర్, పార్వతీ మెల్టన్ వంటి నటులను పరిశ్రమకు పరిచయం చేశాను. అలాగే సరోజినీ దేవి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డును కూడా పొందాను.