ఖమ్మం, మే19(మేజర్న్యూస్): రైతు సమస్య మరోసారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఖమ్మంలో శుక్రవారం జరిగిన 13వ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రైతు సమస్యల గురించి గంటపాటు వాగ్వాదం జరిగింది. ఖమ్మం ఘటనలపై చర్చించాలని, ఆ అంశాన్ని ఎజెండాలో చేర్చాలని కోరుతూ ఎం.ఎల్.సి పొంగులేటి సుధాకర రెడ్డితో పాటు విపక్షానికి చెందిన సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, న్యూడెమొక్రసీ సభ్యులు పట్టుబట్టారు. ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించాలనీ, ఖరీఫ్ ప్రారంభం అవుతున్నందున గతంలోలా నకిలీ విత్తనాలు సమస్య లేకుండా చూడాలని, మిర్చి రైతులకు ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా బోనస్ ప్రకటించాలని కోరారు. ఖమ్మం మార్కెట్ ఘటనలో రైతులపై పెట్టిన అక్రమ కేసులును ఎత్తివేయాలని డిమాండ్గ చేశారు. ఈమేరకు జడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు. దీనికి చైర్పర్సన్ గడిపల్లి కవిత అంగీకరించలేదు. రైతు సమస్యలను విడిగా చర్చించుకుందామని సూచించారు. దీంతో రైతు సమస్యలను ఎజెండాలో చేర్చనందుకు, రైతులపై కేసులు ఎత్తివేయాలని జడ్గ.పి సమావేశంలో తీర్మానం చేయడానికి అంగీకరించనందుకు నిరసనగా శుక్రవారం ఖమ్మంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని విపక్షాలు బాయ్కాట్ చేశాయి. ఖమ్మం మార్కెట్ లో మిర్చి రైతులపై పెట్టిన అక్రమ కేసులు, మార్కెట్లో జరిగిన ఘటనలు, ఇతర రైతాంగ సమస్యలపై చర్చించాలని విపక్ష సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, న్యూడెమక్రసీ సభ్యులతో పాటు అధికార పార్టీకి చెందిన టిఆర్ఎస్ జడ్గపిటిసి ఒకరు కూడా పట్టుబట్టారు. చైర్మన్ గడిపల్లి కవిత ఆ సమస్యలు ఎజెండాలో లేవని తెలిపారు. దీంతో జిల్లాలో ప్రధానమైన రైతాంగం సమస్యలు చర్చించకపోతే ఎలా అంటూ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ సభ్యులు పట్టుబట్టారు. సమావేశంలో హరితహారం, మిషన్ భగీరధ వంటి ప్రభుత్వ పథకాలపైననే చర్చకు ఎజెండా తయారుచేయడంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇవన్నీ ఎపుడూ చర్చించే సాధారణ ఎజెండాలేనని, వాటితో పాటు అతి ముఖ్యమైన రైతాంగ సమస్యలను చర్చించాలని కోరారు. ప్రలు మనల్ని ఎన్నుకున్నది వారి సమస్యలను చర్చించి పరిష్కారం చూపడానికేతప్ప రాజకీయం చేయడానికి కాదని ఎం.ఎల్.సి పొంగులేటి సుధాకర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అధికారపార్టీకి తొత్తులుగా మారారని ముఖ్యమైన ప్రజాసమస్యలపై దృష్టి లేదనీ ఆయన విమర్శించారు. రైతులపై అక్రమకేసులు పెట్టి, దొంగల మాదిరిగా సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకొచ్చారన్నారు. ఖమ్మం మార్కెట్లో దళారులకు అండగా, రైతులను దోచుకునేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. రైతుల సమస్యలపై చర్చలేనపుడు తాము ఈ సమావేశంలో ఉండి ప్రయోజనం లేదన్నారు. పొంగులేటితో పాటు విపక్ష సభ్యులంతా జడ్గపి లోని గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్త చేశారు. విపక్షాలతో అధికారపార్టీకి చెందిన టిఆర్ఎస్ టేకులపల్లి జడ్గపిటిసి లక్కినేని సురేంద్ర కూడా గొంతు కలిపారు. రైతు సమస్యలు న్యాయమైనవైనందున వాటి పరిష్కారానికి చర్చించనందున తానూ బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ విగ్రహం ముందు విపక్షాలు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిర్చికి గిట్టుబాలు ధర క్వింటాలుకు రు.10వేలు చెల్లించాలని, ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా వెంటనే బోనస్ ఇవ్వాలని, అక్రమకేసులు ఎత్తివేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని, సాగునీటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్గ చేశారు. సమావేశాన్ని బాయ్కాట్ చేసినవారిలో సిపిఎం సభ్యులు బాణోతు కొండా, చిటుమోదు నాగేశ్వరరావు, జియావుద్దీన్, సిపిఐ సభ్యులు మౌలానా, కాంగ్రెస్ సభ్యులు బుల్లెట్ బాబు, పరంజ్యోతి, శిరీష, న్యూడెమొక్రసీ సబ్యులు గోనె అయిలయ్య, చండ్ర అరుణలతో పాటు టిఆర్ఎస్ సభ్యుడు లక్కినేని సురేంద్ర, ఎంఎల్సి పొంగులేటి సుధాకరరెడ్డి ఉన్నారు. ఒక గంట పాటు సమావేశంలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యులు బాయ్కాట్ చేసిన తరువాత సమావేశం జరిగింది. ఎపుడూ రాత్రి వరకూ జరిగే జడ్పీ సమావేశం అధికారులు, అధికార పక్ష సభ్యుల సమక్షంలో ఎజెండా మేరకు మద్యాహ్నం ఒంటిగంటకే ముగిసింది.