మేజర్న్యూస్ తెలంగాణ ప్రతినిధిః టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదని టిడిపి సీనియర్ నేత సీతక్క ఆరోపించారు. తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినా అవేవి టిఆర్ఎస్ నేతలకు పట్టడం లేదని ఆమె విమర్శించారు. శనివారం వరంగల్ జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీతక్క మాట్లాడారు. మిర్చీ రైతులు కనీస మద్దతు ధరలు లేక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతుల కష్టాలను తెలుసుకునేందుకు మంత్రులు ఎందుకు రావడం లేదని ప్రశ్నీంచారు. టిఆర్ఎస్ ఆవిర్బావ సభ పేరుతో టిఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. ఉచిత ఎరువుల పేరుతో మరో సరికొత్త డ్రామాకు సిఎం శ్రీకారం చుట్టారన్నారు. ప్రగతి భవన్ కాస్తా ప్రగతి నిరోదక భవన్గా మారిందన్నారు. అంకెల గారడీతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మోసపూరిత కుట్రలతో టిఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు చేశారని విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కెసిఆర్ సర్కార్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యలలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో ఉందన్నారు. విద్య గురించి గొప్పగా చెప్పే కెసిఆర్ కెజి టు పిజి ఉచిత విద్యకు సంబందించి బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఏ ముఖ్యమంత్రి ఇంతగా మోసం చేయలేదన్నారు. ఈ విలేఖరుల సమావేవంలో పార్టీ నేతలు గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం, పుల్లూరి అశోక్కుమార్, మార్గం సారంగం తదితరులు పాల్గొన్నారు.