దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్.. బాలింతల కోసం 16 వస్తువులతో కూడిన కిట్ ను అందిస్తున్నారని మంత్రి హరిశ్ రావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ నిధులు తగ్గించినా.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం ఈ పథకాన్ని సొంత నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. ఇందుకు ఏటా 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని చెప్పారు. సిద్దిపేట ఎంసీహెచ్ లో కేసీఆర్ కిట్ పథకాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలవారి చెకప్లు చేయించుకుని, ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన వారిని ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెండ్లి అయ్యే వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని వెల్లడించారు. తల్లి, బిడ్డ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
అటు గర్భిణులకు అనవసరంగా సిజేరియన్లు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్రావు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో సిజేరియన్లు క్రమక్రమంగా తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరమున్నా.. లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారని, దీని వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పేరిట గత ప్రభుత్వం ఆస్పత్రులను అధ్వాన్న స్థితిలోకి మార్చాయని ధ్వజమెత్తారు. తెలంగాణ సర్కార్ వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్న ఆయన.. నెల రోజుల్లో సిద్ధిపేటలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సిద్ధిపేట ఏంసీహెచ్ దవాఖానకు వచ్చే రోగులతో పాటు వారి బంధువులకు కూడా భోజనామృతం పథకం అమలు చేస్తూ.. అందరి ప్రశంసలు పొందుతున్నట్లు మంత్రి చెప్పారు.