న్యూఢిల్లీ : క్యాటరింగ్ సేవలను మరింత మెరుగు పరచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక పాలసీని ఈ రోజు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు విడుదల చేయనున్నారు. వంటల నిర్వహణ, ఆహార పదార్థాల సరఫరాను వేరు చేయాలనే ఉద్దేశంతో ఈ పాలసీని రూపొందించింది. రైల్వే క్యాటరింగ్పై ప్రయాణికుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ఈ పాలసీలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలపై నాణ్యత, ప్రమాణాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఆయా రాష్ర్టాల్లో ఆహార పదార్థాలను తయారుచేసి, ఆతిథ్య రంగానికి చెందిన సంస్థల ద్వారా సరఫరా చేసే అవకాశం ఉందని విభిన్న వర్గాల ద్వారా తెలిసింది. 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన క్యాటరింగ్ పాలసీ స్థానంలో ఈ నూతన పాలసీ అందుబాటులోకి రానున్నది.