న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మె సైరన్ మోగించాయి. ది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్బీయూ) పరిధిలోని చాలావరకు ఉద్యోగ సంఘాలు రేపు సమ్మెకు పిలుపునిచ్చాయి. దాంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఇంకా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ విషయంపై ముందస్తు సమాచారం అందించాయి. అయితే ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థల కార్యకలాపాలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నాయి. యూఎఫ్బీయూ పరిధిలో దేశంలోని 9 బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలున్నాయి. కానీ అందులో భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ విభాగాలైన నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్లు మాత్రం ఈ సమ్మెకు దూరంగా ఉండనున్నాయి.