ముంబై: మనదేశంలో రిచెస్ట్ సిటీగా ముంబై నిలిచింది. మొత్తం రూ.54 లక్షల 72 వేల కోట్ల సంపదతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. వరల్డ్ వెల్త్ రిపోర్ట్ తాజా నివేదిక ప్రకారం భారత ఆర్థిక రాజధానిలో 46 వేల మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక సంపదలో ముంబై తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నిలిచాయి. ఢిల్లీ మొత్తం సంపద 30 లక్షల కోట్లు. దేశ రాజధానిలో మొత్తం 23 వేల మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక తర్వాతి స్థానంలో ఉన్న బెంగళూరు మొత్తం సంపద 21 లక్షల 35 వేల కోట్లు కాగా.. ఈ ఐటీ హబ్లో 7700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు ఉన్నారు.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మన రాష్ట్ర రాజధాని మొత్తం సంపద 20 లక్షల 68 వేల కోట్లు. భాగ్యనగరంలో 9 వేల మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో పుణె ఉంది. ఇక్కడి మొత్తం సంపద 12 లక్షల కోట్లు. 4500 మంది మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లు ఉన్నారు. మొత్తం దేశ సంపద డిసెంబర్ 2016 నాటికి 4 కోట్ల 13 లక్షల 70 వేల కోట్లుగా ఉంది. దేశంలో మొత్తం 264000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది.