గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు (గతంలో) ఛోటాషకీల్ కోసం పనిచేసే షార్ప్ షూటర్ జునైద్ చౌదరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్లో పుట్టిన కెనడా జాతీయుడైన తారిక్ ఫతేను హత్య చేయడానికి ఈ షూటర్, ఛోటాషకీల్ నుంచి సుపారీ తీసుకున్నాడని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. జూన్ 7-8 మధ్య రాత్రి ఢిల్లీ వజీరా రోడ్డులో ఇతన్ని పట్టుకున్నారు. జునైద్ను గత సంవత్సరం ఆయుధాలు, హవాలా కేసుల్లో అరెస్ట్ చేసినప్పటికీ నాలుగు నెలల్లోనే బెయిల్ మీద బయటకొచ్చేశాడు. హిందూ సభ అధ్యక్షుడైన స్వామి చక్రపాణిని హత్య చేయడానికి ఇతను మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. బెయిల్ మీద విడుదలైన తర్వాత మరోసారి జునైద్ ఛోటాషకీల్ను మరోసారి సంప్రదించాడని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ ఆపరేషన్స్ నిర్వహించడంలో జునైద్ను ఛోటాషకీల్ వినియోగించుకుంటున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఇతన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఛోటాషకీల్ ప్రత్యర్థి ఛోటారాజన్ ను మట్టుబెట్టడానికి జునైద్ను ఉపయోగించుకున్నట్లు గతంలో పోలీసులకు ఆధారాలు దొరికాయి. జునైద్ మొబైల్ ఫోన్లో ఛోటాషకీల్ ఆడియో క్లిప్స్ సైతం దొరికాయి. ఛోటారాజన్ను 2015లో ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేసి భారత్ కు అప్పగించారు. ప్రస్తుతం అతను సీబీఐ కస్టడీలో వున్నాడు. నిజానికి ఛోటారాజన్, ఛోటా షకీల్ వంటివాళ్లంతా ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కోసం పనిచేసినవాళ్లే! ఇప్పుడు జునైద్ మరోసారి పోలీసులకు పట్టుబడడంతో విచారణలో కొత్త విషయాలు ఏమైనా వెలుగులోకి వస్తాయా అన్నది వేచిచూడాల్సిన అంశం!