ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివాజీ గురించి చరిత్రకు తెలియని నిజాలు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 09:43 PM

శివాజీ... భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ మతం పులకించిపోతుంది. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజపుర, గోల్కొండ సుల్తానులు, మొఘలులకు ముచ్చెమటలు పట్టించాడు.
తన గురువు సమర్ధ రామదాసు, తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు. స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మశక్యంగాని నిజాలు ఎన్నో ఉన్నాయి. శివాజీ పేరు శివుడు నుంచి వచ్చింది కాదని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు, ఓ ప్రాంతంలోని భక్తులు శివుడుని శివాయ్ అని పిలుస్తారు కూడా.
ముస్లిం దురాక్రమణదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాలను నుంచి హిందువులుగా మారిన వారిని గౌరవించేవాడు. అంతే కాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. హిందూ మతాన్ని కాపాడటం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు.
అతని స్నేహితుల్లో చాలా మంది మహ్మదీయులు ఉన్నారు. అంతే కాదు సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సుముచిత స్థానం కల్పించారు. బిజపుర సుల్తాలను ఓడించడానికి మెఘల్ పాలకుడు ఔరంగజేబుకు సహాయపడ్డాడు. అహ్మద్‌నగర్ ముట్టడిలో కీలక పాత్ర పోషించాడు.
యుద్ధ తంత్రాల్లోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 2,000 మంది సైనికులను 10,000 మంది స్థాయికి పెంచుకోగలిగాడు. సైనిక సంపత్తి ప్రాముఖ్యతను, తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్ఠమైన సైన్యంతోపాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, అధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు. వీటిలో ముఖ్యమైంది గొరిల్లా దాడి.
శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారు. వారి ప్రాణాలను ఫణంగా పెట్టి యుద్ధం చేయడానికి విముఖత చూపేవారు. సైనికులు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో అనూహ్యంగా అక్కడ నుంచి వారిని నిష్క్రమింపజేసేవారు.
పటిష్ఠమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజులకు రాకపోవడం గమనార్హం.
తనకంటే బలవంతుడైన, ధీశాలి అయిన అఫ్జల్ ఖాన్‌ను చాకచక్యంగా అంతం చేశాడు. అఫ్జల్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన చేతులకు పులిగోళ్లను తొడుక్కుని అతడిని హతమార్చాడు.
మహిళల పట్ల అపారమైన గౌరవం. ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవారు కాదు. ఇలా ఎవరైనా చేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు.
నైపుణ్యం ఉన్నవారినే సైనికులుగా స్వీకరించేవారు. సైన్యంలో ఎలాంటి సిఫార్సులను పట్టించుకునేవారు కాదు. అలాగే సైనికులకు వ్యక్తిగత ఆయుధాలను కూడా ఇవ్వడానికి నిరాకరించారు. కొన్ని సమయాల్లో వీటితో రాజ్యంలోని పౌరులకు హాని కలుగుతుందని భావించారు. వేరే రాజ్యాలను ఆక్రమించుకునే సందర్భంలో దోచుకున్న ఆయుధాలకు తప్పనిసరిగా లెక్కలు చూపి, ఆయుధ గారానికి తరలించాలనే నిబంధనలు అమలు చేశారు. అలాగే మత ప్రదేశాలు, ఇళ్లపై దాడులకు అంగీకరించేవారు కాదు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa