ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా వాళ్లను తిరిగి చూస్తాననుకోలేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 08:50 PM

డాక్టర్ రామమూర్తి... ఐసిస్ ఉగ్రవాదుల చెరలో 17 నెలల పాటూ బందీగా ఉన్నారు. అదృష్టవశాత్తూ ఆయన ఐసిస్ చెర నుంచి బయటపడి విజయవాడ చేరుకున్నారు. భార్య బిడ్డలని కలుసుకున్నారు. ఆ క్షణం ఆ ప్రాంతమంతా తీవ్ర భావోద్వేగాలు నిండాయి. తండ్రిని చూసిన బిడ్డలు, కుటుంబాన్ని చూసిన రామమూర్తి కళ్ల నీళ్లు నింపుకున్నారు. అనంతరం ఆయన తన అనుభవాల్ని మీడియాకు తెలియ జేశారు. తన భార్య బిడ్డల్ని తిరిగి చూస్తానని అనుకోలేదని, అంతా కలలా ఉందని అన్నారు.
ఆయన లిబియాలో వైద్యుడిగా పనిచేసేందుకు వెళ్లాడు. కాగా 2015 సెప్టెంబర్ 8న ఆసుపత్రికి వచ్చి రామమూర్తితో సహా, మరో ఇండియన్ డాక్టర్, ఏడు నర్సులను కలిపి కిడ్నాప్ చేశారు. అప్పట్నించి లిబియా యుద్ధ క్షేత్రాలకు తీసుకెళ్లారు. అక్కడ గాయపడిన తమ జిహాదీలకు చికిత్స చేసేందుకు ఇతడిని ఉపయోగించుకున్నారు. ఐసిస్ ఉగ్రవాదులపై ప్రభుత్వ దళాలు జరిపిన దాడుల్లో రామమూర్తికి కూడా గాయాలయ్యాయి. ఒక బుల్లెట్ మణికట్టులో ఇప్పటికీ అలాగే ఉంది. కాలికి కూడా గాయాలయ్యాయి. ఐసిస్ క్రూరత్వాన్ని దగ్గర నుంచి చూశారు రామమూర్తి. తన కళ్లముందే తోటి ఖైదీల గొంతు కోయడం చూశారు. నరకం అంటే అక్కడే ఉందని అన్నారు ఆయన. తాను బతుకుతానని, తిరిగి కుటుంబాన్ని చూస్తానని మాత్రం ఊహించుకోలేదన్నారు.
అదృష్టవశాత్తూ... రామమూర్తిని ఉంచిన స్థావరాన్ని ప్రభుత్వ దళాలు ఆక్రమించాయి. వారికి తన కథని చెప్పుకున్న రమణమూర్తి​ రామమూర్తి భారత అధికారులతో మాట్లాడించమని వేడుకున్నారు. అప్పటికే భారత ప్రభుత్వం కూడా అతని క్షేమం గురించి లిబియా అధికారులతో మాట్లాడుతున్నారు. చివరికి అతడిని టర్కీ తరలించి అక్కణ్నించి న్యూఢిల్లీ తీసుకువచ్చారు. ఢిల్లీ నుంచి ఆయన విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కనీసం చెప్పులు కూడా వేసుకోలేని పరిస్థితి, కాలికి గాయాలతో ఉన్న ఆయన్ని చూసి అక్కడ అందరికీ కళ్లు చెమర్చాయి.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa