రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్న చేయూత పొదుపు పథకం ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. పోచంపల్లి నుంచి నేతన్నకు చేయూత పథకం ప్రారంభించడం సంతోషాన్ని కల్గిస్తుందన్నారు మంత్రి. పోచంపల్లి చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ పథకాన్ని పోచంపల్లి నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేతన్నల కష్టాలు సీఎం కేసీఆర్కు బాగా తెలుసన్నారు. ఈ క్రమంలోనే వారి సంక్షేమం కోసం సీఎం పలు కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ. 75 కోట్లు కేటాయించారని తెలిపారు. చేనేత, జౌళి శాఖకు బడ్జెట్లో రూ. 1283 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి నేత కార్మికుడి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని స్పష్టం చేశారు. నేతన్నలకు నూలు, అద్దకాల మీద 50 శాతం సబ్సిడీని త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పును తీసుకువస్తుందన్నారు.