సిడ్నీ : సంచలనాలకు మారుపేరుగా నిలిచిన భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ వరుసగా రెండోసారి సూపర్ సిరీస్ ఫైనల్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్లో భాగంగా శనివారం జరిగిన సెమీఫైనల్లో కిదాంబి శ్రీకాంత్... నాలుగో సీడ్ షై యుకి(చెనా)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో కిదాంబి ప్రత్యర్థిపై సునాయాసంగా విజయం సాధించాడు. కేవలం 37 నిమిషాల్లో రెండు వరుస గేమ్లను 21-10, 21-14తో గెలుచుకున్న శ్రీకాంత్ మ్యాచ్ని కైవసం చేసుకుని ఫైనల్కి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్కి ముందు కిదాంబి ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ల్లో వరుసగా రెండు సార్లు ప్రపంచ నెంబర్ వన్కి షాకిచ్చిన కిదాంబి అదే ఫామ్ను ఫైనల్లోనూ కొనసాగిస్తే టెటిల్ గెలవడం ఖాయం.