హైదరాబాద్, మేజర్న్యూస్ : రైతు రుణమాఫీని అమలు చేయడంతో పాటు ఇప్పటికీ బ్యాంకులలో ఉన్న రైతుల పాస్ బుక్కులను తక్షణమే విడుదల చేయించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలు ఆందోళనల సందర్భంగా ప్రభుత్వానికి తాము బ్యాంకుల విషయంలో నివేదించిన అంశాలనే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పుడు అధికారికంగా మాట్లాడుతున్నారని, మంత్రి మాటలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన అన్నారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి ఈటెల బ్యాంకర్ల తీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో రేవంత్ శనివారం ఒక ప్రకటన మీడియాకు విడుదల చేశారు. మంత్రి వాస్తవాలనే మాట్లాడుతున్నా రని, టీఆర్ఎస్ మూడేళ్ల పాలనపై ప్రజల భ్రమలన్నీ తొలగిపోయాయన్నారు. రాష్ట్రాన్ని పాలించే సమర్థత, శక్తి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని అర్థమైందన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని, లక్షల ఇండ్ల నిర్మాణాలను చేపట్టామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ నిధులకు సంబంధించిన డిపాజిట్లను వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్న బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడంపై ఆసక్తి చూపడం లేదన్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమం వల్ల బ్యాంకులు లాభపడ్డాయి కానీ రైతులు లాభపడలేదని రుణమాఫీ పూర్తి కాకపోవడంతో లక్షలాది మంది రైతులకు సంబంధించిన పాస్బుక్లు కూడా బ్యాంకులలోనే ఉండిపోయాయని ఇదివరకే తాము పలుమార్లు చెప్పామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసి బ్యాంకులల్లో మగ్గుతున్న రైతుల పాస్ పుస్తకాలను తక్షణమే విడుదల చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.