స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన డిజె (దువ్వాడ జగన్నాథం) భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. బ్రాహ్మణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో పాటల్లో హీరోయిన్ అందాలను పొగుడుతూ హీరో పాడే గుడిలో.. మడిలో పాటలో దొర్లిన నమకం, చమకం పదాల మీద ఇప్పటికే నానా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. శివుడికి ఇష్టమైన నమకం.. చమకం.. పదాలను శృంగారంలో వాడటం అరిష్టమని దాంతో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆగ్రహంతో ఒక వర్గాన్ని అవమానించారన్న విమర్శలు పెద్ద ఎత్తున ముసురుకున్నాయి. దీనిపై దర్శకుడు సర్ది చెప్పి.. సినిమాలో ఆ పదాలు ఏ సందర్భంలో వచ్చేది.. దాని ప్రాధాన్యతను వివరించి.. తాను కూడా బ్రాహ్మణుడినేనంటూ సర్దిచెప్పుకోవడంతో.. చివరకు అభ్యంతరకరంగా ఉన్న ఆ పదాల్ని తొలగించటంతో ఒక వివాదం సద్దుమణిగినట్టైంది. తాజాగా విడుదలైన ఈ సినిమాలో మరో వివాదం తలెత్తుతున్నట్టు తెలుస్తుంది. పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని హీరో చెప్పులు వేసుకొని పఠించాడని పలువురు వేద బ్రాహ్మణులు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం విశిష్ఠత తెలిసి ఇలాంటి తప్పులు చేస్తారా? అని తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని పలువురి మనోభావాల్ని దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. యజ్ఞోపవీతం వేసే సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠిస్తారని.. ఆ మంత్రం అత్యంత పవిత్రమైనదని.. అలాంటి మంత్రాన్ని బ్రాహ్మణులుగా పుట్టిన వారు మాత్రమే కాదు.. వైశ్యులు.. క్షత్రియులు యజ్ఞోపవీతానికి చాలా పవిత్రంగా చూసుకుంటారని.. అలాంటిది.. ఆ సీన్ అలా తీయటం ఏమిటంటూ ఫైర్ అవుతున్నారు. బ్రాహ్మణులు ఎలా ఉంటారన్న విషయంపై తాను పండితుల దగ్గర శిక్షణ పొందినట్లుగా హీరో చెప్పారని.. మరి.. పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకొని చదవకూడదని చెప్పలేదా? అంటూ క్వశ్చన్ వేస్తున్నారు. చిత్ర బృందం తప్పు చేస్తే.. దాన్ని సరిదిద్దాల్సిన సెన్సార్ బోర్డు ఏం చేస్తుందని కొందరు తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామంటూ పలువురు చెబుతున్నారు. మరీ.. వివాదంపై చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.