ఎక్కడి నుంచి పోటీ చేసినా తన గెలుపు తథ్యమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ఆంధ్రాలో పోటీచేసినా గెలిచే సత్తా నాకుందని అన్నారు. మీడియాతో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నల్గొండ జిల్లాలోని 12 స్థానాలు సహా, తెలంగాణలో 110 చోట్ల తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, తాను ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని, ఆంధ్రాలో పోటీ చేసినా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించాలంటే కేంద్రంతో సఖ్యత చాలా అవసరమని పేర్కొన్నారు.
అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో మెరుగైన సంబంధాలు కొనసాగించాలని కోరారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అవసరమని అభిప్రాయపడ్డ జగదీశ్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలగడం వెనుక రాష్ట్ర ప్రయోజనాలే కారణమని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఏ ప్రభుత్వాలు చేయలేని పనులు తాము చేసి చూపిస్తున్నామని తెలిపారు. అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa