హైదరాబాద్: మాదక ద్రవ్యాల కేసులో విచారణ నిమిత్తం అబ్కారీ శాఖ సిట్ అధికారుల ఎదుట సినీనటుడు నవదీప్ ఈరోజు హాజరయ్యారు. ఈ కేసులో వరుసగా నాలుగు రోజులు సినీ ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు ఆదివారం విరామం ఇచ్చారు. ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా నవదీప్కు నోటీసులు జారీచేయడంతో ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్.కె.నాయుడు, సుబ్బరాజు, తరుణ్లను సిట్ విచారించింది. వారిని కెల్విన్తో సంబంధాలపై విచారించగా.. నవదీప్ను మాత్రం కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడిన జాక్ అనే వ్యక్తి కాల్డేటా ఆధారంగా విచారణకు పిలిచినట్లు సమాచారం. జాక్తో తనకు పరిచయం ఉంది గానీ.. డ్రగ్స్తో సంబంధం లేదని నవదీప్ అంటున్నారు.
మాదకద్రవ్యాల కేసులో ఇప్పటివరకు 16 మందినిఅబ్కారీశాఖ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఎల్.ఎస్.డి డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాపైనే సిట్ దృష్టి సారించింది. కానీ ఈనెల 9వ తేదీన అరెస్ట్ అయిన మెహిదీపట్నంకు చెందిన జిషన్ అలీఖాన్ అలియాస్ జాక్ అనే వ్యక్తి బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న కాకతీయ టవర్స్ వద్ద కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇతనితో పాటు నైజీరియన్ బెర్నార్డ్ విల్సన్ జూబ్లీహిల్స్ స్టార్ హోటల్ లో అరెస్ట్ అయ్యారు. గతంలో జాక్ అనే వ్యక్తి ఈవెంట్ మేనేజర్ గా ఉన్న సమయంలో కొందరు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. నిందితుల కాల్ డేటా ఆధారంగా కొందరికి నోటీసులు పంపారు. ఈ విధంగా నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖుల్లో... నేడు విచారణకు హాజరవుతున్న హీరో నవదీప్ కు మాత్రం జాక్ అనే వ్యక్తి వద్ద ఉన్న కాల్ డేటా ఆధారంగా నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నవదీప్ కూడా అంగీకరిస్తున్నాడు. తనకు కెల్విన్ ఎవరో తెలియదని... జాక్ అనే వ్యక్తి నెల కిందట ఈవెంట్ మేనేజర్ గా పరిచయం అయ్యాడని... ఆ సందర్భంగా తన ఫోన్ నెంబరు అతని వద్ద ఉండొచ్చని నవదీప్ చెబుతున్నాడు. అంతేకానీ తనకు మాదక ద్రవ్యాలతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa