ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్రో మాజీ చీఫ్ యుఆర్ రావు కన్నుమూత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 11:42 AM

ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు(యు.ఆర్‌.రావు) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గుండె సంబంధిత వ్యాధితో ఈ ఏడాది మొదట్లో హాస్పిటల్ చేరిన రావు.. సోమవారం తెల్లవారుజామున 2.30 సమయంలో మృతిచెందారు.


యు.ఆర్.రావు 1932 మార్చి 10న కర్ణాటకలోని ఉడిపి జిల్లా అడమారులో జన్మించారు. సతీష్ ధవన్ తరవాత 10 ఏళ్ల పాటు (1984-1994) ఇస్రోకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఇస్రో పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు. ఎంజీకే మీనన్, సతీష్ ధవన్, విక్రమ్ సారాభాయి వంటి మేధావులతో కలసి పనిచేశారు. భారత తొలి వాహక నౌక ఆర్యభట్ట రూపకల్పనలో ఆయనదే ప్రధాన పాత్ర. ఆర్యభట్ట నుంచి నేటి మార్ష్ ఆర్బిటర్ మిషన్ వరకు అన్ని ఇస్రో ప్రాజెక్టులకు ఆయన పనిచేశారు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఇన్‌శాట్‌ వాహక నౌకల అభివృద్ధిలో ఆయన భాగస్వామిగా ఉన్నారు.


ఇస్రో‌తో పాటు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ గవర్నింగ్ బాడీకి చైర్మన్‌గానూ, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చాన్స్‌లర్‌గానూ యు.ఆర్.రావు పనిచేశారు. ఆయన 1976లో పద్మభూషణ్‌, 2017 జనవరిలో పద్మవిభూషణ్‌ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 యూనివర్సిటీల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ (D.Sc) గౌరవ డిగ్రీని అందుకున్నారు. రావుకు డీఎస్సీ అందించిన వర్సిటీల్లో యూరప్‌లోనే అతిపురాతనమైన యూనివర్సిటీ ఆఫ్ బొలొగ్నా కూడా ఉంది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఆయన చేసిన సేవలకు గాను నాసాతో పాటు పలు దేశాల నుంచి అవార్డులు అందుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa