హైదరాబాద్ : రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆన్ లైన్ ద్వారా ఫ్లాట్లను విక్రయించనున్నారు. మొదటి దశలో బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన 3,719 ఫ్లాట్లను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పారదర్శకంగా ప్లాట్లను విక్రయించేందుకు రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ తరఫున ఆన్ లైన్ ప్రక్రియ కోసం త్వరలోనే వెబ్ సైట్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేక అప్లికేషన్ ను అభివృద్ధి చేసిందని ఇంద్రకరణ్ చెప్పారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కోట్ల విలువైన ఫ్లాట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని, సరైన విధంగా మార్కెట్ ను అంచనా వేయకుండా గత ప్రభుత్వాలు గుడ్డిగా భారీ ఖర్చుతో ఈ ప్రాజెక్టును చేపట్టాయన్నారు. నిర్మాణాలు పూర్తయినా ప్లాట్లు అమ్మలేదన్నారు. దీంతోపాటు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి గత ప్రభుత్వాలు వడ్డీ కూడా సరిగా చెల్లించకపోవడంతో ఆ భారం తెలంగాణ రాజీవ్ స్వగృహ మీద పడిందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటాగా వడ్డీతో కలిపి రూ. 1,069 కోట్ల రూపాయల భారం రాజీవ్ స్వగృహపై పడిందన్నారు. సీఎం కేసీఆర్ రాజీవ్ స్వగృహపై ఉన్న అప్పులను తీర్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారని, తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి ఇప్పటి వరకు రూ.820 కోట్ల రుణాన్ని తీర్చినట్లు ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే మిగిలిన రూ.256 కోట్ల అప్పును తీర్చేందుకు సీఎం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.