హైదరబాద్ : హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలమండలికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన్ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిత్యం 90 లక్షల మందికి శుద్ధజలాలను అందిస్తున్నందుకు ఈ గుర్తింపు దక్కింది. సంస్థ ప్రతినిధులు ఐఎస్వో ధ్రువీకరణ పత్రాన్ని జలమండలి అధికారులకు అందజేశారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని సేకరిస్తున్న జలమండలి.. వాటిని శుద్ధిచేసి, నిల్వచేసి, పంపింగ్ చేస్తూ నగరవాసులకు అందిస్తున్నది. 2017 జూలై 15వ తేదీ నుంచి 2020 జూలై 14 వరకు ఐఎస్వో గుర్తింపు చెల్లుబాటు కానుంది. జలమండలికి ఐఎస్వో గుర్తింపు లభించడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఎండీ దానకిశోర్, ఉద్యోగులు, సిబ్బంది పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఐఎస్వో గుర్తింపు దక్కడంపై జలమండలి ఎండీ దానకిశోర్ సైతం హర్షం వ్యక్తంచేశారు. సుదూర ప్రాంతం నుంచి నీటిని తీసుకొచ్చి నగరవాసులకు నాణ్యమైన నీటినందిస్తున్న సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అధికారులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా కృషిచేస్తున్నందుకే ఈ గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి, సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించే సంస్థలకు ఐఎస్వో గుర్తింపునిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa