ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి ఉదయం పదిగంటల నుంచి ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 08:38 AM

​నేటి ఉదయం పదిగంటల నుంచి ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ఆరంభం కానుంది. ఉభయ సభల సభ్యులు ఓటు హక్కును కలిగిన ఈ ఎన్నిక పోలింగ్ సాయంత్రం ఐదు వరకూ జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే కౌంటింగ్ మొదలవుతుంది. ఈ రోజు రాత్రికే ఈ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా వెంకయ్య నాయుడు, యూపీఏ తరపు అభ్యర్థిగా గోపాలకృష్ణ‌ గాంధీలు తలపడుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై స్పష్టత ఉంది. ఇందులో వెంకయ్య విజయం లాంఛనమే.


లోక్‌సభ, రాజ్య సభల్లో ఇరు వర్గాలకూ గల బలాబలాలను బట్టి చూస్తే వెంకయ్యను విజయం వరించనుందని స్పష్టం అవుతోంది. లోక్‌సభలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉంది. ఎన్డీయే వర్గాల నుంచి కూడా బలం కలిసొస్తోంది. కనీసం యాభై శాతం ఓట్లను పొందిన వారు విజేతగా నిలవనున్నారు. లోక్‌సభలో ఎన్డీయేకు మొత్తం 338మంది ఎంపీల బలం ఉంది. ఇక అన్నాడీఎంకే, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి.


రాజ్యసభలో బీజేపీకి సొంతంగా 58మంది ఎంపీలున్నారు. అలాగే ఎన్డీయే, ఎన్డీయేతర పార్టీలు కొన్నింటి మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఓట్లలో వెంకయ్య నాయుడికి 50 శాతానికి పైగా ఓట్లు పడటం ఖాయమే. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లోనే గాక, ఉప రాష్ట్రపతి ఎన్నికలో కూడా బీజేపీ నిలిపిన అభ్యర్థే గెలవనున్నాడని స్పష్టం అవుతోంది. ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల పదో తేదీతో ముగియనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa