మోరదాబాద్: శత్రుసైన్యం, ఉగ్రవాదుల బారి నుంచి భారత్ను కాపాడేందుకు నిరంతరం సైనికులు సరిహద్దుల వెంట కాపాలాగా ఉంటారు. దేశ భద్రత విషయంలో అవసరమైతే తమ ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి సైనికుల కోసం ఉత్తరప్రదేశ్లోని మోరదాబాద్ పాఠశాల చిన్నారులు ప్రత్యేకంగా రాఖీ తయారు చేశారు. ఎంతో ప్రేమతో వారంతా కష్టపడి దాదాపు 100 అడుగుల పొడవైన రాఖీని స్వయంగా తయారు చేసి సరిహద్దులో పహారా కాస్తున్న సైన్యానికి పంపించారు.
మోరాదాబాద్కు చెందిన కొంతమంది విద్యార్థులు.. కులమతాల ఐక్యత ప్రతిబింబించే విధంగా ఈ రాఖీని తయారు చేశారు. ఇందు కోసం రంగు రంగుల కాగితాలు, బట్టలు, లేసులు, ఇతర అలంకరణ వస్తువులను ఉపయోగించారు. దేశ శాంతి, సామరస్యానికి ప్రతీకగా ఈ రాఖీ ఉంది. ఇటీవల జమ్ముకశ్మీర్లో తరచూ జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల కారణంగా ఎంతో మంది జవాన్లు అమరులవుతున్నారు. వారికి మేమున్నాం.. అంటూ ఆ చిన్నారులు ఎంతో సహృదయంతో వినూత్నంగా ఆలోచించి ఈ రాఖీని తయారు చేశారు.