పెద్దపల్లి: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఆదివరహస్వామి ఆలయంలో సతి సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించి అక్కడి నుండి వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ లో నీటిని నింపేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 10న శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. 1000 కోట్ల నిధులతో రైతులకు ఎంతగానో మేలు చేసే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు. ఈ ఎస్సారెస్పీ ఆధునీకరణ ద్వారా 9 లక్షల ఎకరాలు భూమి సాగులోకి వస్తాయన్నారు. కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో తప్పులను వెతికి చూసే అవకాశం లేకపోవడంతో చిన్న చిన్న సంఘటనలను రాద్దాంతం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడూతున్నారని విమర్శించారు . ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కోరుకంటి చందర్, దాసరి రాజలింగు, కిషన్ రెడ్డి, పిల్లి శేఖర్, రామారావ్, భూమయ్య, లక్ష్మి మల్లు,శంకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.