ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పక్కాగా సమగ్ర భూసర్వే రికార్డులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2017, 11:12 AM

రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ దందాలకు చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టారు. భూ రికార్డులన్నీ పక్కాగా ఉండేలా.. భూ సర్వే చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సర్వే కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. సర్వే రికార్డుల కోసం ఫొటోగ్రఫీ, డీజీపీఎస్‌, లైడార్‌లలో ఎలాంటి పద్ధతులు అవలంభించాలనే దానిపై ఆలోచించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 19న జరుగనున్న రెవెన్యూ శాఖ సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్‌. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే సర్వే విధివిధానాల రూపకల్పన జరుగుతుందని, తరువాత 3500  మంది అధికారులతో ఆయన ఫేస్‌ టూ ఫేస్‌ మీట్‌లో దిశానిర్దేశం చేయనున్నారని తెలిసింది.


 సమైక్య రాష్ట్రంలో 28 ఏళ్లుగా సర్వే జరుగకపోవడంతో రికార్డులు తారుమారయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న జిల్లాల్లోని భూములను అక్రమార్కులు కాజేశారు. ప్రభుత్వ భూములు, సీలింగ్‌, సర్ఫఖాస్‌, కాంధీశీకుల భూములు, గురుకుల్‌ ట్రస్ట్‌, భూదాన్‌, అసైన్డ్‌ భూములు.. ఇలా వివిధ రకాలుగా ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన భూములను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మియాపూర్‌లోని విలువైన భూములు కాజేసేందుకు యత్నించారు. ఇలాంటి దందాలకు పూర్తిస్థాయిలో ఫుల్‌స్టాప్‌ పడాలంటే ఏ భూమి ఎవరిదనే విషయంలో నక్షతో సహా స్పష్టంగా రూపొందించాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం సమగ్ర భూ సర్వే చేయాలని, రికార్డులన్నీ ఆధునీకరించాలని ఆదేశించారు. ఇందుకు చేపట్టాల్సిన కార్యక్రమాన్ని రూపొందించడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌ చైర్మన్‌గా కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.


గ్రామ ప్రజలు, రైతు సంఘాల సమక్షంలోనే రికార్డుల నవీకరణ జరగాలని సీఎం సూచించారు. ఈ పనుల కోసం మూడు గ్రామాలకు ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని చెప్పారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సర్వే చేయాలన్నారు. సమగ్ర భూ సర్వేపై ఉన్నతస్థాయి అధికారులతో మరోసారి కూడా సీఎం కేసీఆర్‌ సమాలోచనలు చేసి సర్వేకు ఏ విధానం అవలంభిస్తే లెక్కలు కరెక్టుగా వస్తాయి.. ఎలా అయితే సర్వే త్వరగా పూర్తవుతుందని అడిగినట్లు తెలిసింది. వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతులకు ఎకరానికి 8 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని సర్వే తరువాతనే ప్రారంభించాలని.. కాబట్టిఎట్టి పరిస్థితుల్లోనూ సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు.


ఫొటోగ్రఫీ, డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం, లూడార్‌ అనే మూడు పద్ధతుల్లో సర్వే చేయొచ్చని అధికారులు తెలిపారు. లైడార్‌ పద్ధతిలో మొత్తం సర్వేను 45 రోజుల్లో పూర్తి చేయొచ్చని.. మిగతా పద్ధతుల్లో అయితే కొంత సమయం ఎక్కువ పడే అవకాశముంటుందని అధికారులు సీఎంకు వివరించారు. దాంతో పాటు కొలతల్లోనూ చాలా తేడాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com