దుబాయ్: న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ గురువారం విడుదల చేసింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు మెగా టోర్నీ అభిమానులను కనువిందు చేయనుంది. యువభారత్ తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడనున్నాయి. గ్రూపు-ఎలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెన్యా ఉండగా, గ్రూపు-బిలో భారత్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యూగినియా ఉన్నాయి. ఇక గ్రూపు- సి లో బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, నమీబియా పోటీలో ఉండగా, గ్రూపు-డిలో పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ ఉన్నాయి. క్రైస్ట్చర్చ్, క్వీన్స్టన్, తౌరంగ, వాంగరైయి వేదికలుగా మ్యాచ్లు జరుగుతాయి.