బెంగళూరు: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేశారు. సీఈవోగా తప్పుకున్న సిక్కాను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా నియమించారు. ఈ మేరకు సంస్థ శుక్రవారం ప్రకటించింది. సిక్కా రాజీనామాను కంపెనీ ఆమోదించింది. తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్ రావ్ను నియమించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే కొత్త ఎండీ, సీఈవోను బోర్డు ఎన్నిక చేస్తుందని పేర్కొంది. 2014 జూన్ 12న సిక్కా ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. అభిప్రాయబేధాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు కంపెనీకి రాసిన లేఖలో సిక్కా పేర్కొన్నట్లు సమాచారం.
సిక్కా రాజీనామాతో తాత్కాలిక సీఈవో, ఎండీగా ప్రవీణ్రావ్ బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరు యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నుంచి పట్టా పొందిన ప్రవీణ్ 1986లో ఇన్ఫోసిస్లో చేరారు. సుదీర్ఘకాలంలో కంపెనీలో సేవలందిస్తున్న ప్రవీణ్.. పలు కీలక పదవుల్లో పనిచేశారు. మేనేజ్మెంట్ సర్వీసెస్, రీటెల్, కన్సూ్యమర్ ప్యాకేజ్ గూడ్స్కు హెడ్గా, యూరప్కు డెలివరీ హెడ్గా వ్యవహరించారు. ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేగాక ఇన్ఫోసిస్ బీపీవోకు కూడా ప్రవీణ్ ఛైర్మన్గా ఉన్నారు. కాగా.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) నేషనల్ కౌన్సిల్లో, నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రవీణ్ సభ్యుడిగా ఉన్నారు.
కాగా.. చరిత్రలోనే తొలిసారిగా ఇన్ఫోసిస్ షేర్ల తిరిగి కొనుగోలు(బైబ్యాక్)కు సమాయత్తమవుతున్న నేపథ్యంలో సిక్కా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 19న జరగబోయే బోర్డు డైరెక్టర్ల సమావేశంలో బైబ్యాక్ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించిన విషయం తెలిసిందే.