హ్యాకింగ్పై జరిపిన దర్యాప్తులో కంపెనీ అసమర్థంగా వ్యవహరించిందని తేలడంతో మెరిస్సా సంస్థ పొరపాటుకు బాధ్యత వహించారు. ‘నేను కంపెనీ సీఈఓని. నేను అధికారంలో ఉండగా ఈ ఘటన జరిగింది. కాబట్టి ఈ ఏడాది నా బోనస్ను, ఈక్విటీ గ్రాంట్ను వదులుకుంటున్నాను’ అని మెరిస్సా ఓ ప్రకటనలో తెలిపారు. ఆమెకు 2 మిలియన్ డాలర్లు(సుమారు రూ.13.34కోట్లు) బోనస్ రావాల్సి ఉండగా ఆమె ఆ మొత్తాన్ని తీసుకోవడం లేదు. తన బోనస్ను కంపెనీలో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు పంచాలని చెప్పారు. మెరిస్సా 2012 నుంచి యాహూ చీఫ్గా వ్యవహరిస్తున్నారు.
వెరిజాన్ సంస్థ గత ఏడాది యాహూను 4.48బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వెరిజాన్తో డీల్ ఈ జులైతో ముగుస్తుంది. దీంతో స్వతంత్ర కంపెనీగా యాహూ 20ఏళ్ల ప్రస్థానం ముగుస్తుంది. 1.5బిలియన్ ఖాతాలపై ప్రభావం చూపిన సైబర్ దాడులు, తదితర కేసులను యాహూ ఇంకా ఎదుర్కొంటోంది. 2014, 2013 సంవత్సరాల్లో కూడా యాహూ చాలా పెద్ద సైబర్దాడులకు గురైంది. వెరిజాన్తో యాహూ పూర్తిగా మెర్జ్ అయిన తర్వాత మెరిస్సా కంపెనీ బోర్డ్ నుంచి తప్పుకోనున్నారు. యాహూ కోర్ బిజినెస్లో మాత్రం ఆమె కొనసాగనున్నారు.