హైదరాబాద్ : తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు.. చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. దీంతో గ్రామం, పట్టణం, నగరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ చీరలను పంపిణీ చేస్తున్నారు. 500 ఆకర్షణీయమైన డిజైన్లతో కోటి 4 లక్షలకు పైగా చీరలను పంపిణీ చేస్తుందిప్రభుత్వం. ఈ చీరల పంపిణీ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు చీరల పంపిణీ జరగనుంది. తెల్ల రేషన్ కార్డులో పేరు ఉండి.. 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలందరికీ చీరలను బతుకమ్మ కానుకగా ఇవ్వనున్నారు.