భూతల స్వర్గంగా పేరొందిన అందాల గోవా రాష్ట్రంలో ఇకపై బహిరంగ స్థలాల్లో మద్యం తాగడాన్ని నిషేధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే గోవా బీచ్లు, మద్యం దుకాణాలు తాజా ఉత్తర్వులతో వెలవెల పోనున్నాయి. గోవాలో ఎవరైనా మద్యం తాగాలంటే లోపల తాగాలి కాని బహిరంగ స్థలాల్లో కాదని సీఎం మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా బహిరంగస్థలాల్లో మద్యం తాగితే వారికి జరిమానాలు విధిస్తామని, మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని సీఎం ప్రకటించారు. మందుబాబులు రోడ్లపక్కన కూర్చొని మద్యం తాగి బాటిళ్లను పగలగొట్టి న్యూసెన్స్ సృష్టిస్తున్నందున ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు సీఎం వివరించారు. గత ఏడాది గోవా బీచ్ లలో మద్యం తాగకుండా ‘నో ఆల్కాహాల్ జోన్’ అంటూ ప్రకటించింది. సీఎం ప్రకటన నేపథ్యంలో పోలీసులు బహిరంగ స్థలాల్లో మద్యం తాగేవారిని అరెస్టులు చేస్తున్నారు.