తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలను పంపిణీ చేస్తామన్న ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం...తీరా డామేజ్ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు. కేవలం వంద రూపాయల విలువచేసే సాధారణ చీరలు పంపిణీ చేసిందని ఆరోపిస్తూ పలు జిల్లాల్లో మహిళలు.. చీరలు కాల్చేసి బతుకమ్మ ఆడారు.
జనగామ జిల్లా : జిల్లా కేంద్రంలోని 12వ వార్డు బుడగ జంగాల కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఆందోళనకు దిగారు. 50రూపాయలు విలువ కూడా చేయని చీరలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అగౌరవ పరుస్తున్న అని ఎద్దేవా చేశారు. ఆ చీరలు బతుకమ్మకు కట్టుకోమని మహిళలు వాటిని అక్కడే పడేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా : భువనగిరి పట్టణంలోని 22, 23వ వార్డులో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అయితే వాటిని అందుతున్న మహిళలు చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే కుప్పగా వేసి నిప్పు పెట్టారు. చీరలు కాలుతుండగా చుట్టూ చేరి బతుకమ్మ ఆడారు. పోచంపల్లి చేనేత చీరెలు పంపిణీ చేస్తానని కేవలం 50 రూపాయలు విలువచేసే పాలిస్టర్ చీరెలు పంపుతారా అని కోపోద్రుక్తులయ్యారు.
జగిత్యాల జిల్లా : జిల్లా మండలం చల్గల్, లింగంపేటలో ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళల ధర్నాకు దిగారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేసి మహిళలు తమ నిరసన తెలిపారు.